ఎంత చక్కనిదైనా గతమంతా ఒక స్వగతం.జ్ఞాపకాల తోటలోకి అందరికీ స్వాగతం.

Tuesday 9 August 2011

'మో ' కలత నిద్ర



ఇటీవలే కీర్తిశేషుడైన
వేగుంట మోహన ప్రసాద్ 'మో '


1960,1'ఏప్రెల్ లో

విశ్వవీణ అనే పక్ష పత్రికలో రాసిన

రసరమ్య శబ్దచిత్రం ఇది.

1989 జనవరి 1 సంచిక ఆంధ్రజ్యోతి వారపత్రికలో పునర్ముద్రణమైన ఈ రచన
మళ్ళీ మీ కోసం...

కలత నిద్ర






మహానగరమనే బ్రహ్మరాక్షసి నిద్ర పోతూంది.కాళ్ళు బారచాపి వెల్లకిల పడు కుని భూమి అనే తలగడ దిండునుపైన తల పెట్టుకుని గురక కొడుతూ నిద్రపోతూంది. రాత్రి అనే చీర కట్టుకుని ,చీకటి అనే ముసుగు తన్ని అలసిపోయి వళ్ళు హూనం చేసుకుని ,దేహంలోని వేరువేరు ముక్కలన్నీ దగ్గర పెట్టుకుని ,తిరిగి తిరిగి వచ్చి ,చచ్చీ చెడీ ,కూడు తినకుండ,కడుపు మండి ,తలకాయ పగిలి కళ్ళు లోతుకు పోయి,పళ్ళు బయటకు వచ్చి తన మీద తనకు కోపం వచ్చి,ఎవరినో సాధిద్దామని బిర్రబిగుసుకుని పడుకున్నది.


ఎక్కడో ఒక కుక్క ఒక్కసారి లేచి నుంచొని,మొరిగి, తన కాలిని తాను కరుచుకుని,నోరు మూసుకుని కూలబడిoది.ఒకేసారి నగరం ఒంటి మీద పడుకున్న కుక్కలన్నీ చెవులు రిక్కించి ఒకదాని తరువాత ఒకటి అరచి నిద్రపోయినట్లు చచ్చాయ్.


నగరం పక్కకు ఒత్తిగిల్లింది.కాళ్ళతో నేలను ఈడ్చి తన్ని ,కాళ్ళు కడుపులో పెట్టుకుని పడుకున్నది.నగరం కలవరించింది.కలలో కలసిన మరో కొరివి దయ్యాన్ని పలుకరించింది.గొణిగింది,సణిగింది. తిట్టుకున్నది.మళ్ళా చచ్చిపడ్డట్లు నిద్ర పోయింది. నగరం కంటి పొరల్లో మళ్ళా ఏదో కలల కలకలం బయలుదేరింది.కలలో శృంగారం వెళ్ళమోస్తోంది. నగరం చెవిలో జోరీగ దూరింది. అదిరిపడి దాన్ని చంపేదాకా ఊరుకోలేదు. మళ్ళా అటుపక్కకు వొత్తిగిల్లింది.


నగరం క్షయతో తీసుకుచస్తున్నట్లు పొడి దగ్గు దగ్గింది.గుక్క వచ్చినట్లు రక్తం కళ్ళెలు కక్కింది.క్రింద పడిన రక్తాన్నే మళ్ళా జుర్రుకుంటున్నది.నగరం కాళ్ళు కుష్టు వ్యాధికి బలి అయినవి,నగరం ఇదివరకు వ్యభిచరించింది. దాని వళ్ళు జ్వరంతో కాగిపోతోంది. ఊపిరి ఆడి చావక, కోడి మెడకాయ కోస్తే ,అది కెకెకె మన్నట్లు కొట్టుక చస్తుంది. నగరం కళ్ళలో ఎవరో నిప్పులు పోసారు.కుంపట్లాంటి కళ్ళల్లో బొగ్గుల్లాంటి కనుపాపలు రాజుకొంటున్నవి. ఒక ప్రక్క నగరంఒంటిమీద వున్న నీటి కుళాయి నెవరూ కట్టేయలేదు. దాని ఒళ్ళంతా రొచ్చురొచ్చుగా వుంది. దోమలు మూగుతూ సంగీతం పాడుతున్నవి.నగరం భుజాలనే రైలు పట్టాల మీద గూడ్స్ బండి కూస్తూ వెళ్ళిపోయింది.రైలు పట్టలు విరిగి పోయినయ్. నగరం శరీరం మాంసపు ముద్దయింది. చంద్రుడనే దీపం కొండెక్కింది.


భగవాన్! ఈ నగరం ఎంత నరకమైనా కానీ,దానికి చావు తగదు. అసలు సృష్టి లోని ఏ జీవరాశి ఇలా అంతమవకూడదు.ఆ చావు ఎవరికీ వద్దు.నీవు చేసిన ఈ ప్రపంచమనే బొమ్మరింటిపై అంత కసి అయితే ,నిన్ను నీవు ప్రేమించుకోలేవన్నమాట.


మేము చేసే పాపాలకు మాకు శిక్ష ఇవ్వవద్దు.మాకు పశ్చాత్తాపం కలిగే ఆత్మజ్ఞానాన్ని ప్రదర్శించు. పువ్వును పువ్వుగానే రాలిపోనీ. వడలిపోనీయకు. అంతిమ క్షణాల్లో మా కంఠంలో ఆందోళన కొట్టుకులాడనివ్వకు. నా మాటవిని ఈ బలి మానివేసేయ్. ఇందుకోసంలోకం నిన్నేదేదో అంటూంది. అవన్నీ వినలేకుండా వున్నాను. అలా చేస్తానని మాట ఇవ్వు.నీకెందుకు. మా అంతట మేము నీకు అంకితం ఐపోతాము. ముందు ఈ చీకట్లో మమ్మలిని మేము వెతుక్కోటానికి ఒక చిన్న జ్యోతిని ప్రసాదించు. ఆ జ్యోతే మేముగా నీలో చేరి పోతాం. మా కనుపాపలపైన ఈ నీలి నీడలు తుడిచివేయి. ఈ చీకటిని ఎక్కడికైనా విసిరివేయి.కాదూ! నీ వెలుగుకు ఎంత చల్లదనం వుంటుందో అంత వేడికూడా వుంటుంది. ఆ నిప్పుతో దాన్ని కాల్చేయ్.


నగరం కళ్ళలో చంద్రుడు కాస్తున్నాడు. పునర్జన్మ ఎత్తినట్లు పసిపాపలా చిరునవ్వు నవ్వుతూ బుల్లిబుల్లి చేతులతో చప్పట్లు కొడుతూ నగరం ప్రపంచమనే ఉయ్యాల లోంచి లేచింది. భగవంతుడు అనే అమ్మ పసిపాపకు స్తన్యమిచ్చింది.


మానవత్వం ఆత్మహత్య చేసుకోగా ,పశుప్రాయంగా మరణించిన నగరంలోదేవత్వం ప్రవేశించింది.







1 comment:

  1. ఇప్పటికీ నగరం కలత నిద్ర లో ఉంది..'మో' ఎంతస్పష్టంగా రాశారు..!

    ReplyDelete